పారిస్‌ : హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ఫ్లూ వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కంబోడియాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అన్ని దేశాలు బర్డ్‌ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఈ బాలిక ఫిబ్రవరి 16న తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహించగా బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 22న ప్రాణాలు కోల్పోయింది. అనంతరం బాలిక తండ్రి సహా ఆమెతో సన్నిహితంగా మెలిగిన 12 మంది నమూనాలను అధికారులు సేకరించారు. తండ్రికి కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. అయితే అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతావారి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.*

*వీరి పరిస్థితిపై కంబోడియా అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కోళ్లు, ఇతర పక్షుల్లో మాత్రమే కన్పించే బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు అత్యంత అరుదుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో మనుషులకు డైరెక్ట్ కాంటాక్ట్‌ ఉంటేనే అది సోకే అవకాశముంది. అయితే బాలికకు, ఆమె తండ్రికి బర్డ్‌ఫ్లూ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కోళ్లు, పక్షులతో సన్నిహితంగా మెలిగారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాలిక నుంచే ఆమె తండ్రకి వైరస్ సోకిందా? అనే విషయంపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని అధికారులు పేర్కొన్నారు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్నాయని, కొందరు మానవులకు కూడా ఈ వైరస్ వాపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని హెచ్చరించింది.