ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు ఈ నెల 14న సంక్రాంతి అంటే.. మరి కొందరు 15వ తేదీనే అని చెబుతున్నారు. అయితే ఈ నెల 14న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో సూర్య భగవానుడినిన పూజించటం, పుణ్య స్నానాలు, దానాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మరుసటి రోజు (జనవరి 15) తెల్లవారుజామున ఉదయం 07:15 నుంచి 09:06 మధ్య కాలంలో స్నానాలు, దానాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.సంక్రాంతి పర్వదిన రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. ఆ తరువాత శుభ్రమైన దుస్తులు ధరించి.. రాగి కలశంలో ఎర్రని పువ్వులు తీసుకోవాలి. అందులో అక్షత, బెల్లం తీసుకోవాలి. ఆ తరువాత, సూర్య భగవానుడికి అర్ఘ్యను సమర్పించాలి. సూర్య భగవానుడి బీజ్ మంత్రాన్ని జపించాలి. ఇదీ మంత్రం.. ఓం ఘృణి సూర్య: ఆదిత్య: ఓం హ్రీ హ్రీ సూర్యాయ నమః. సంక్రాంతి పర్వదినం రోజున భగవత్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవాలి. అంతేకాకుండా ఆహారం, దుప్పటి, నువ్వులు, నెయ్యి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. పండుగ రోజు నువ్వులతోపాటు పాత్రలను అవసరం ఉన్నవారికి దానం చేస్తే శని నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.
మకర సంక్రాంతి రోజున తల స్నానం చేసి దానం చేయడం చాలా ముఖ్యం. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు నువ్వులు దానం చేయడం అత్యంత ముఖ్యమైనది. మకర సంక్రాంతి రోజున చేసే దానం వల్ల ఈ జన్మలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలగడమే కాకుండా.. ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని ప్రజల నమ్మకం.