ఇక బరిగీసుడే! పోరాడండి… అండగా ఉంటాం! – జర్నలిస్టుల మహాధర్నాకు ముక్త కంఠంతో అఖిల పక్షం మద్దతు – జోరువానలోనూ దద్దరిల్లిన ధర్నాచౌక్ హైదరాబాద్: జెఎన్జే హౌసింగ్సొసైటీకి చెందిన 70 ఎకరాలు స్థలాలు ముమ్మాటికి వారివేనని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించాయి. స్రుపీం కోర్టు తుది తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం తీరును ఎండగట్టాయి. జేఎన్జే సభ్యులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మంగళవారం ఇందిరాపార్కువద్దగల ధర్నా చౌక్లో జేఎన్జే ఫౌండర్ మెంబర్ పివి రమణారావు ,సీనియర్ జర్నలిస్ట్ కొండం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జేఎన్జే సభ్యులు నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్, బిజెపి, సిపిఎం,సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు, జర్నలిస్ట్ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ గత నాలుగు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సంప్రదాయం వుందన్నారు. ఇప్పుడు కూడా జేఎన్జే హౌసింగ్ సొసైటీకి 70 ఎకరాల స్థలం కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గత 16 సంవత్సరాల క్రితమే జర్నలిస్టులు ఈ భూములను కొనుగోలు చేసినప్పటికీ, కోర్టు కేసుల కారణంగా ఇప్పటివరకు ఆలస్యమైందని, ఇప్పుడు సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం సొసైటీకి ఆ స్థలాలను స్వాధీనం చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్త్ర ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేయకపోవడం ఒక తప్పిదమైతే, కోర్టు తీర్పును అమలు చేయకపోవడం పై సొసైటీ సభ్యులు కంటెంప్ట్ కు వెళ్లకుండా నిర్లక్ష్యం చేయడం కూడా న్యాయపరంగా తప్పిదమే అవుతుందని మల్లురవి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో సుప్రీం తీర్పును సంబందిత పాలకులు కచ్చితంగా అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అభాసుపాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చి చెపుతున్న మాటలన్నీ పార్టీ రాష్త్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదేశాల మేరకేనని ఆయన వివరించారు. జర్నలిస్టుల జాగాలే లాక్కుంటారా?— ఈటెల నాడు తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు నేడు తాము కొనుకున్న ఇళ్ల స్థలాల కోసం రోడెక్కి ధర్నాలు చేయడం దురద్రుష్టకరమని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్, శాసనసభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. 2008లో రూ. 2 లక్షల పెట్టి కొన్న స్థలాలను వారికి అప్పగించకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారని ప్రశ్నించారు.
అప్పు, సప్పు చేసి అప్పట్లో జర్నలిస్టులు ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వానికి చెల్లించి కొనుగొలు చేసిన భూమిని లాక్కోవాలని ప్రభుత్వం చూడడం వారి నీచ బుద్దిని తెలియజేస్తుందన్నారు. కార్పోరేట్ సంస్థలకు, బిఆర్ఎస్ పైరవీదారులకు లీజుల పేరుతో ఒక్క రూపాయికే లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడం ప్రభుత్వం దుర్నీతిని ఆయన తూర్పారాబట్టారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన రాజకీయ రీసెర్చ్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల భూమిని కారు చౌకగా కొనుగోలు చేయడం ధారుణమన్నారు. అక్కడ ఎకరం భూమి మార్కెట్ విలువ రూ. 40 కోట్లు విలువ వుండగా, బిఆర్ఎస్ పార్టీకోసం అడ్డికి పావు షేరు లెక్కన నామ మాత్రపు ధరతో కొనుగోలు చేయడం సిగ్గు చేటన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా జర్నలిస్టులకు భూములను అప్పగించే వరకు భారతీయ జనతాపార్టీ అండగా వుంటుందన్నారు. ఇక నుంచి జర్నలిస్టుల స్థలాల సాధనలో లాభీయింగ్లు పనిచేయవు… ఇక బరిగీసి కొట్లాడుడేనని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఎందుకివ్వరు?— వి.హెచ్. వివిధ సంఘాలకు ఉచితంగా స్థలాలు ఇస్తున్న రాష్త్ర ప్రభుత్వం జర్నలిస్టులు డబ్బులు పెట్టి కొనుకున్న స్థలాలును ఎందుకివ్వడంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతురావు ప్రశ్నించారు.
న్యాయమైన జర్నలిస్టు కోరిక తీరేవరకు వారి వెన్నంటి వుంటామని స్పష్టం చేశారు. మరో ఆరు నెలలలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతోంది… ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేనని, అప్పుడు మీస్థలాలు కూడా మళ్లీ మేమే ఇస్తామని చెప్పారు. దానం చేసేది కాదు– మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు నాడు రెండు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన భూమి మాత్రమే కాని, ప్రభుత్వం దానంగా ఇచ్చేది కాదని బిజెపి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు అన్నారు.
జెఎన్జె సభ్యులకు న్యాయపరంగా తమ పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నట్లు మరో సారి స్పష్టం చేశారు. పోరాటం సహేతుకమే….సిపిఎం జేఎన్జే సభ్యులు చేస్తున్న పోరాటం సహేతుకమైనదేనని సిపిఎం రాష్త్ర కార్యదర్సి వర్గ సభ్యుడు డి.జి.నరసింహారావు అన్నారు.
డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని జర్నలిస్టులకు రాష్త్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంలో గల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. న్యాయసమ్మతమైన మీ పోరాటానికి మా మద్దతు వుంటుందన్నారు. అధికార పార్టీతో వున్నా … మద్దతిస్తాం— సిపిఐ అధికార బిఆర్ఎస్ పార్టీతో తమకు పొత్తు వున్నప్పటికీ జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు వుంటుందని సిపిఐ పార్టీ రాష్త్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రచట్టం తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుకురావాలన్నారు.
బిజెపి మహళామోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో ప్రజలందరి సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులే సమస్యలో ఇరుక్కోవడం, దానికి రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వడం పాలకుల నిర్భందానికి నిదర్శనమని అన్నారు. జర్నలిస్టుల స్థలాల సాధనలో బిజెపి ఎల్లవేళలా అండగా వుంటుందన్నారు. ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసారు….ఇందిరా శోభన్ తెలంగాణ ఉద్యమ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతునిచ్చిన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా రాష్త్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇందుకు నిదర్శనమే తమ ఇళ్ళ స్థలాలకోసం ధర్నా చేయాల్సి వస్తుందని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ ఇంధిరా శోబన్ అన్నారు. పాలకులకు నిజమైన ప్రేమ వుంటే సుప్రీం తీర్పు మేరకు తక్షణమే వారి భూమి వారికే కేటాయించాలన్నారు. డబ్బు పెట్టి కొన్న భూమిని మీది కాదని చెప్పే ధైర్య వారికెక్కడిదని అన్నారు. పేట్బషీరాబాద్ 38 ఎకరాల స్థలాన్ని వెంటనే జేఎన్జే సొసైటీకి అప్పగించాలని పిఓడబ్ల్యు సంధ్య అన్నారు. జేఎన్జే సభ్యులు దాదాపు 63 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల అరుణోదయ విమలక్క తీవ్రంగా తప్పుబట్టారు.
జోరువానలోనూ పెద్ద ఎత్తున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేశారు.