TT Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ…పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీల సభలు, సమావేశాలతో స్పీడ్ పెంచుతున్నాయి.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ మొదలైంది. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా పోటా పోటీ కార్యక్రమాలకు కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత… సెప్టెంబరు 17న హైదరాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు…కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినం నిర్వ‌హిస్తామ‌ని అంటున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ విష‌యంలో తగ్గేదేలే అంటూ గ్రౌండ్ లెవ‌ల్‌ పోలిటీక్స్ కు రెడీ అయ్యాయి.

సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత…సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని కోసం రక్షణ శాఖకు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. అయితే అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు…బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గతేడాది పరేడ్ గ్రౌండ్స్‌లోనే కేంద్రం ఆధ్వర్యంలో బీజేపీ సభ నిర్వహించింది. మ‌రోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు అనుమతి ఇవ్వకపోతే…ఎల్బీ స్టేడియంకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఈ నెల 2నే రక్షణ శాఖ అధికారులకు లేఖ రాశామన్న రేవంత్… సభకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

మొదటి ఆప్షన్ పరేడ్ గ్రౌండ్…రెండో ఆప్షన్ ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నామన్నారు రేవంత్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు భద్రత ఉన్న జాతీయ నేతలు వచ్చిపుడు ప్రభుత్వం విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వని పక్షంలో… ఔటర్ బయట కొంగర కలాన్, ఇతర ప్రాంతాల్లో సభ నిర్వహించుకుంటామన్నారు. సభ ఎక్కడ పెట్టినా.. సక్సెస్ చేసేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

తెలంగాణలో ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. మ‌రోవైపు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తోంది. తద్వారా ఎన్నికల సమరశంఖం పూరించడమే కాకుండా…పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని నిర్ణయించుకుంది.

తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17కు ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజును…ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది. విలీనం, విమోచనం, విద్రోహం లాంటి చర్చలు దీర్ఘకాలంగానే సాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. బీజేపీ సెప్టెంబరు 17ను విమోచనా దినం గా పరిగణిస్తోంది. అధికార బీఆర్ఎస్ మాత్రం జాతీయ సమైక్యతా దినంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. హోం మంత్రి అమిత్ షా, సోనియాగాంధీ సభలను తలదన్నేలా ఏం మెసేజ్ ఇవ్వాలన్న దానిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది.

ఒకే రోజున ప్రత్యర్థి పార్టీల నేతల స్పీచ్‌లు ఉంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపే విమోచనా దినోత్సవాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో..ఆ రెండు పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు దీటుగా, పోటీగా ఏం చేయాలనే దానిపై గులాబీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు పరేడ్‌ గ్రౌండ్స్‌లోనే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే…పరేడ్ గ్రౌండ్ లోనే బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది అక్కడే సభ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. అటు కాంగ్రెస్ పార్టీ…ఇటు బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్ కోసం పోటీ పడుతున్నాయి.

రక్షణ శాఖ అధికారులు ముందు దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుమతిస్తారా ? లేదంటే బీజేపీ సభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదిఏమైనా తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఎంతో రోజురోజుకు ర‌స‌వంతంగా మారుతున్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *