
గులాబీ దళం లో ఒక వైపు బుజ్జగింపులు… మరో వైపు ఫిరాయింపులు..!
బీఆర్ఎస్లో అసంతృప్త నేతల లిస్ట్ రోజుకు రోజుకు పెరిగిపోతోంది. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.. దీంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. మరోవైపు అలాంటి నేతలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ అసంతృప్తులు ఏ పార్టీలో చేరుతారు? అనేదే ఇప్పుడు పోలిటీకల్ గ్రౌండ్ లో హాట్ టాపిక్ గా మారింది..
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత… టికెట్ రాని వారు ముకుమ్మడిగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్ను వీడి వెళ్తున్న వాళ్లు కొందరైతే… పార్టీలోనే ఉంటూ రగిలిపోతున్నవాళ్లు మరికొందరు. ఇప్పటికే కొంతమంది రాజీనామా చేయగా… మరికొంత మంది గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు. ఇలా జంపింగ్ జపాంగ్ లిస్ట్లో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు… కీలక నేతలు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది బీఆర్ఎస్ అధినాయకత్వం. కీలక నేతలు పార్టీని వీడకుండా ఎక్కడి కక్కడ కట్టడి చేయాటానికి రంగం సిద్దం చేసుకుంటోంది. అసంతృప్తులు… ప్రతిపక్ష పార్టీలకు వెళ్తే… తమ ప్రత్యర్థులకు ప్లస్ అవుతుందని, అందుకే వారికి ఆలాంటి ఆవకాశం ఇవ్వకుడదని పక్క ప్లాన్ తో ముందుకు వెళుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఒకేసారి 115మంది అభ్యర్థులను ప్రకటించి పత్రి పక్షాలకు సవాలు విసిరారు. మూడోసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని, అసంతృప్తులు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆ పార్టీ నేతలు ధీమా వ్వక్తం చేస్తున్నారు.. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలకు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని… ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని వారికి నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. తాండూర్ టికెట్ ను పైలెట్ రోహిత్ రెడ్డికి కేటాయించారు. అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్న పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించారు. ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.
ఇక కేసీఆర్ లాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సీట్లు కేటాయించడం అంత ఈజీ కాదని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. హస్తం పార్టీలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల ఒక సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీటిస్తే మరో నేతకు కోపం వస్తుంది. పార్టీ కార్యాలయాల్లో రచ్చరచ్చ చేస్తారని, అందుకే టికెట్ల కేటాయింపుల్లో ఆ పార్టీ మల్లాగుల్లాలు పడుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు
ఒకవైపు అసంతృప్తులను బుజ్జగించే పనిలో కేసీఆర్ ఉంటే, మరోవైపు ఎలాగైనా వారిని తమ పార్టీల్లోకి లాక్కునేందుకు గాలం వేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. ఇప్పటికే.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నకిరేకల్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్ఎస్ను వీడారు. పెద్దపల్లి నుంచి టిక్కెట్ ఆశించిన నల్ల మనోహర్రెడ్డి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. పాలేరు టికెట్ ఇవ్వలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంతో… ఎమ్మెల్యే రాజయ్య అయితే కింద పడుకుని మరీ ఏడేశ్చారు. కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు సైతం పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారట. టికెట్ రాక బీఆర్ఎస్కు రాజీనామా చేయాలనుకునే వారంతా… కాంగ్రెస్, బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.
టికెట్ రాలేదని ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఆరా తీస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటోంది. ముఖ్యనేతలను రంగంలోకి దింపి… అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో తుమ్మల ఇంటికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు వెళ్లారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని తుమ్మలను బుజ్జగించారు. కేసీఆర్ త్వరలోనే సరైన న్యాయం చేస్తారని, తొందరపడి పార్టీని వీడొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటీకి చర్చలు ఫలించలేదని తెలిసింది. ఇక రాజయ్యను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రంగంలోకి దిగారు. ఇలా ఎవరికి అనుకూలంగా ఉన్నవారిని ఆయా నేతలు కలసి బుజ్జగిస్తున్నారు.